HYDRAA: హైదరాబాద్‌లో 'హైడ్రా' కొరడా.. రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి

హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన 'హైడ్రా' మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురంలో ఆటస్థలం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదు భవనాలను ఇవాళ‌ కూల్చివేసింది. భారీ భద్రత నడుమ ఈ కూల్చివేత ప్రక్రియను పూర్తిచేశారు. స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఆమోదించిన 188 ఎకరాల లేఅవుట్‌లో 6,500 చదరపు గజాల స్థలాన్ని ఆటస్థలం కోసం కేటాయించారు. అయితే, కొందరు వ్యక్తులు ఈ భూమిని కబ్జా చేసి, నకిలీ నోటరీ పత్రాలతో ఇతరులకు ప్లాట్లుగా విక్రయించారు. ఈ స్థలంలో నిర్మాణంలో ఉన్న ఐదు G+3 భవనాలతో పాటు మరో రెండు చిన్న నిర్మాణాలను కూడా హైడ్రా బృందాలు నేలమట్టం చేశాయి. అయితే, మరో రెండు భవనాల్లో కొన్ని కుటుంబాలు నివసిస్తుండటంతో మానవతా దృక్పథంతో వాటిని కూల్చివేయలేదు.

గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ కబ్జాదారులకు నోటీసులు జారీ చేసినా వారు పట్టించుకోలేదు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, కబ్జాలను నిర్ధారించుకున్న తర్వాత ఈ చర్యలు చేపట్టారు.

చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు 2024లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రూ.60,000 కోట్ల విలువైన 1,045 ఎకరాల ప్రభుత్వ భూములు, జలవనరులను తిరిగి స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
HYDRAA
HYDRA Hyderabad
Hyderabad
Telangana government
land grabbing
government land
Rajendranagar
Shaistripuram
GHMC
AV Ranganath

More Telugu News