Coimbatore Elections: 74 ఏళ్లలో తొలిసారి.. కోయంబత్తూరు బరిలో వామపక్షాల మిస్సింగ్

తమిళనాడు రాజకీయ చరిత్రలో అపూర్వమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన కోయంబత్తూరు జిల్లాలో 74 ఏళ్లలో తొలిసారిగా వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం అభ్యర్థులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి నిరంతరాయంగా కొనసాగిన వామపక్షాల ప్రస్థానానికి ఇది తెరదించినట్లయింది.

2026 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు పోటీలో లేకపోవడం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కోయంబత్తూరు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన టెక్స్‌టైల్ రంగం క్షీణించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి తర్వాత నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ (NTC) మిల్లులు సహా అనేక ప్రధాన మిల్లులు మూతపడ్డాయి. దీంతో వామపక్షాలకు వెన్నుదన్నుగా నిలిచే కార్మిక సంఘాలు బలహీనపడ్డాయి. ఈ పరిణామం వారి ఎన్నికల బలంపై తీవ్ర ప్రభావం చూపింది.

చారిత్రకంగా చూస్తే.. కోయంబత్తూరు ఈస్ట్, పేరూరు, సింగనల్లూరు వంటి అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం అనేకసార్లు గెలిచింది. వాల్పారై స్థానాన్ని సీపీఐ రెండుసార్లు కైవసం చేసుకుంది. కోయంబత్తూరు లోక్‌సభ స్థానాన్ని సీపీఐ ఐదుసార్లు, సీపీఎం మూడుసార్లు గెలుచుకున్నాయి.

తాజా ఎన్నికల్లో పోటీలో లేకపోవడానికి డీఎంకే నేతృత్వంలోని కూటమిలో సీట్ల సర్దుబాటే కారణమని తెలుస్తోంది. వాల్పారై, సింగనల్లూరు వంటి సీట్లను ఆశించినప్పటికీ, కూటమిలో వాటిని కేటాయించలేదు. అయితే, పోటీలో లేనప్పటికీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపునకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు.
Coimbatore Elections
Tamil Nadu Politics
Left Parties
CPI
CPM
DMK Alliance
Textile Industry
Indian Politics
Tamil Nadu Assembly Elections
Communist Party of India

More Telugu News