Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతికి తెలంగాణ డీజీపీ కీలక సూచన
దేశంలో మావోయిజం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులకు కీలక పిలుపునిచ్చారు. హింసా మార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసి గౌరవప్రదమైన జీవితం గడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు తక్షణమే లొంగిపోవాలని కోరారు.
గణపతి ఆరోగ్యం క్షీణించిందని తమకు సమాచారం ఉందని వెల్లడించిన డీజీపీ... ఆయన లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మరో ఏడుగురు ముఖ్య నేతలు కూడా వెంటనే ఆయుధాలు వీడాలని కోరారు. గత రెండేళ్లలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారందరికీ ప్రభుత్వం తరపున మెరుగైన పునరావాసం కల్పించామని ఆయన గుర్తు చేశారు. కేంద్రం విధించిన గడువు రేపటితో ముగియనున్న తరుణంలో, అజ్ఞాతంలో ఉన్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు.