రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై కొందరు వ్యక్తులు రాళ్లు, మేకులతో దాడికి యత్నించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఆకివీడులోని స్థానిక రామాలయ స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానికుల ఆహ్వానం మేరకు రఘురామరాజు ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఒక వర్గానికి చెందిన వారు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ రాళ్ల దాడికి దిగారు.
దాడి సమయంలో రఘురామరాజుకు రక్షణగా నిలిచిన కూటమి నేతలపై నిందితులు రాళ్లు, మేకులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ పెనుగులాటలో పలువురు కూటమి నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు రఘురామరాజును సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.
ఘటన అనంతరం ఆకివీడులో అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు... దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిని ముమ్మరం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.