విభజన హామీలు, పెండింగ్ నిధులు.. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన సీఎం చంద్రబాబు

Chandrababu Urges Release of Funds for Andhra Pradesh in Delhi
  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన 
  • కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో భేటీ
  • 2027 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని వినతి
  • పెండింగ్ నిధులు, విభజన హామీలను నెరవేర్చాలని కోరిన సీఎం
  • 'హర్ ఖేత్ కో పానీ' పథకం కింద రూ.285 కోట్లు విడుదల చేయాలని అభ్యర్థన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని, విభజన హామీలను నెరవేర్చాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు.

ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు... రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావలసిన నిధులతో పాటు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరిపి, అవసరమైన సహకారం అందించాలని కోరారు.

అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. 

తాను ఇప్పటికే ఐదుసార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించానని, కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తయిందని వివరించారు. ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా ఉన్న 'స్టాప్ వర్క్ ఆర్డర్‌'ను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే, సామర్థ్యం పెంచిన కుడి, ఎడమ కాలువలకు అయిన అదనపు ఖర్చును రీఎంబర్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే సమావేశంలో 'ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన'లోని 'హర్ ఖేత్ కో పానీ' పథకం కింద రాష్ట్రంలోని 297 నీటి వనరుల పునరుద్ధరణకు రూ.285 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆలమట్టి డ్యామ్ ఎత్తును 524.256 మీటర్లకు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. 

ఈ నిర్ణయం ఏపీ ప్రయోజనాలకు నష్టం చేకూరుస్తుందని, కర్ణాటక చేపడుతున్న పనులను నిలిపివేసేలా ఆదేశించాలని కోరారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర దాహార్తిని తీర్చే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని, నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా సహకరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Amit Shah
Polavaram Project
Central Funds
Narendra Modi
AP Reorganisation Act
Godavari Pushkaralu
CR Patil
Irrigation Projects

More Telugu News