రూ.2.5 కోట్ల సహాయ నిధిలో ఆరోపణలు.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళ అరెస్టు

Amita Singh Tomar KBC Winner Arrested in Flood Relief Scam
  • 2011లో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ తహసీల్దారు
  • వరద బాధితుల సహాయం కోసం అందించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
  • అమితా సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, విధుల నుంచి తొలగింపు
'కౌన్ బనేగా కరోడ్‌పతి' టెలివిజన్ షోలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళా తహసీల్దారు, రూ.2.5 కోట్ల వరద సహాయ నిధి కుంభకోణంలో ఆరోపణలు రావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2021లో మధ్యప్రదేశ్, గ్వాలియర్‌‌లోని బరోడా ప్రాంతంలో వరద బాధితుల సహాయం కోసం అందించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.2.5 కోట్ల మేర నిధులను నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కుంభకోణంలో తహసీల్దారు అమితా సింగ్ తోమర్ పాత్రపై ఆరోపణలు వచ్చాయి. దీనితో పోలీసులు ఆమెను నిందితురాలిగా చేర్చారు. నాటి నుంచి ఆమె విధులకు హాజరుకాకుండా పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. ఈ క్రమంలో తాజాగా ఆమె లొకేషన్‌ను గుర్తించిన అధికారులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి శివపురిలోని జైలుకు తరలించారు.

బరోడా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ అవనీత్ శర్మ నేతృత్వంలోని బృందం, గ్వాలియర్‌లోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తోమర్ విజయ్‌పూర్ తహసీల్దారుగా ఉండేవారని తెలిపారు. బుధవారం కలెక్టర్ అర్పిత వర్మ ఆమెను తహసీల్దారు ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు. తోమర్ గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదని తెలిపారు. కాగా, 2011లో వచ్చిన కౌన్ బనేగా కరోడ్‌పతి 5వ సీజన్‌లో అమితా సింగ్ తోమర్ పాల్గొని, రూ.50 లక్షలు గెలుచుకున్నారు.
Advertisement
Amita Singh Tomar
Kaun Banega Crorepati
KBC
Madhya Pradesh
Gwalior
Flood Relief Fund Scam

More Telugu News