Delhi Government: శిశువులకు ప్రాణదానం.. ఢిల్లీలో ఉచితంగా జన్యు పరీక్షల పథకం ప్రారంభం

Delhi Government Launches Free Genetic Testing for Newborns
షార్ట్స్‌లో చూడండి
నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో ఢిల్లీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శిశువుల్లో పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాలను ముందుగానే గుర్తించేందుకు 'అన్మోల్' (అడ్వాన్స్ డ్ న్యూబోర్న్ మానిటరింగ్ ఫర్ ఆప్టిమల్ లైఫ్ కేర్) పేరుతో ఓ కీలక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలందరికీ ఉచితంగా జెనెటిక్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.

పుట్టినప్పుడు చాలా జన్యు, జీవక్రియ సంబంధిత వ్యాధుల లక్షణాలు బయటపడవు. కానీ అవి పెరిగే కొద్దీ మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపడం, శాశ్వత అంగవైకల్యం కలిగించడం, కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ‘అన్మోల్’ పథకం ద్వారా కంజెనిటల్ హైపోథైరాయిడిజం, సికిల్ సెల్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి 56 రకాల ప్రమాదకరమైన వ్యాధులను ముందే గుర్తించవచ్చు.

ఈ పరీక్ష కోసం శిశువు జన్మించిన 24 నుంచి 72 గంటల లోపు, మడమ నుంచి కొన్ని రక్తపు చుక్కలను సేకరించి ల్యాబ్‌కు పంపుతారు. ఇది చాలా సులభమైన, సురక్షితమైన పద్ధతి. సాధారణంగా ప్రైవేటులో ఇలాంటి పరీక్షలకు రూ.7,000 నుంచి రూ.15,000 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.

వ్యాధి లక్షణాలు బయటపడకముందే గుర్తించి, సరైన చికిత్స, ఆహార నియమాలు పాటిస్తే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కేరళ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్న రెండో ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది.
Go Back to Shorts
Delhi Government
Newborn screening
Genetic testing
Anmol scheme
Infant health
Congenital diseases
Genetic disorders
Child healthcare
Kerala

More Telugu News