Petroleum Ministry: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ప్రచారం.. స్పందించిన కేంద్రం

Petroleum Ministry Responds to Petrol Diesel LPG Shortage Rumors
షార్ట్స్‌లో చూడండి
పెట్రోల్, డీజిల్ కొరత భయంతో బంకుల వద్ద వాహనదారులు బారులుతీరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది.

వ్యూహాత్మక నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని తెలిపింది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద రిఫైనర్ అని, ఐదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఉందని కేంద్రం పేర్కొంది. దేశీయంగా తగినంత సరఫరా కలిగి ఉండంటతో పాటు 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాన్ని సరఫరా చేస్తోందని గుర్తు చేసింది. భారత్‌లోని ప్రతి రిఫైనరీ వందశాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై 27 రోజులు మాత్రమే అయిందని, అయితే భౌగోళిక పరిణామాలతో సంబంధం లేకుండా రాబోయే రెండు నెలల పాటు స్థిరంగా చమురు సరఫరా చేయడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.

ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశీయంగా కూడా ఉత్పత్తి పెంచామని, తద్వారా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గిందని పేర్కొంది. ఎల్పీజీ కొరత లేకుండా వివిధ దేశాల నుంచి కార్గోలను తెప్పిస్తున్నామని వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Go Back to Shorts
Petroleum Ministry
Petrol shortage
Diesel shortage
LPG shortage
Fuel reserves India
Oil reserves India

More Telugu News