Putta Mahesh: డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన పుట్టా మహేశ్... వీడియో ఇదిగో!

Putta Mahesh Responds to Drugs Allegations First Time
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన కథనాలను ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ తీవ్రంగా ఖండించారు. స్టేషన్ బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటలకే ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం స్నేహితులతో కలిసి డిన్నర్ కోసమే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు.

తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, తనపై నియోజకవర్గ ప్రజలు, పార్టీ ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని పుట్టా మహేష్ అన్నారు. మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని, త్వరలోనే అన్ని వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు.

శనివారం రాత్రి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) బృందం దాడి చేసింది. ఈ ఘటనలో ఎంపీ పుట్టా మహేశ్, రోహిత్ రెడ్డి సహా 11 మందిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, అక్కడ ఉన్నవారికి నిర్వహించిన పరీక్షల్లో రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో పుట్టా మహేశ్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం, పుట్టా మహేశ్ సహా ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు, పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, దాడి సమయంలో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నమిత్ శర్మను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్, ఆర్మ్స్ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Putta Mahesh
Eluru TDP MP
Drugs case
Moinabad farmhouse
Pilot Rohit Reddy
Telangana EAGLE
Drug test
Station bail
Ritesh Reddy
Namith Sharma

More Telugu News