Padma Awards: 2027 పద్మ అవార్డులకు నామినేషన్లు ప్రారంభం

Padma Awards 2027 Nominations Open
దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులు-2027 కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రారంభించింది. 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి 2026 జూలై 31 చివరి తేదీ అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

నామినేషన్లు లేదా సిఫార్సులను కేవలం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (awards.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు కేటగిరీలలో ఏటా అందిస్తున్నారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డులతో సత్కరిస్తారు.

ఈ నేపథ్యంలో ప్రతిభావంతులను గుర్తించి నామినేట్ చేయాలని పౌరులను కోరింది. ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫార్సు చేయాలని సూచించింది. పౌరులు తమకు తాముగా కూడా నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. జాతి, వృత్తి, హోదా, లింగ బేధాలు లేకుండా అందరూ ఈ అవార్డులకు అర్హులే. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు (వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా) వీటికి అనర్హులు.
Padma Awards
Padma Awards 2027
Awards gov in
Indian Awards
National Awards Portal
Padma Vibhushan
Padma Bhushan
Padma Shri
Indian Civilian Awards

More Telugu News