తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టు.. చేతికి స్వల్ప గాయం!

  • నార్సింగిలోని ఒక వెంచర్ వద్ద ఆందోళన చేపట్టిన కవిత
  • హైడ్రా వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరిక
  • కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగిలోని ఒక వెంచర్ వద్ద స్థానికులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అంటూ ఆమె నిలదీశారు. హైడ్రా బుల్డోజర్లను పంపించే వరకు తాము ఆందోళన విరమించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు.

ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో ఎక్కిస్తుండగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

కార్యకర్తలు 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. అక్రమ వెంచర్లను కూల్చడానికి హైడ్రా, రంగనాథ్ రావాలని వారు డిమాండ్ చేశారు. కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో కవిత చేతికి స్వల్ప గాయమైంది.


More Telugu News