ఇరాన్‌తో ఉద్రిక్తతలు: ఇజ్రాయెల్ ఎంబసీ అధికారులకు అమెరికా రాయబారి కీలక ఆదేశాలు

  • వెంటనే ఇజ్రాయెల్‌ను వీడాలని రాయబారి ఆదేశాలు
  • ఇప్పటికిప్పుడు భయపడాల్సిందేమీ లేనప్పటికీ, దేశం వీడితే మంచిదని సూచన
  • అమెరికా వెళ్లడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని స్పష్టీకరణ
ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ, ఇజ్రాయెల్‌ను వెంటనే వీడాలని అమెరికా రాయబారి మైక్ హకబీ అక్కడి ఎంబసీలోని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్, అమెరికా మధ్య గత కొన్నాళ్ళుగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా రాయబారి ఈ ఆదేశాలు జారీ చేశారు.

వెంటనే ఇజ్రాయెల్‌ను వీడి స్వదేశానికి వెళ్లాలని సూచించారు. సిబ్బంది అమెరికా వెళ్లడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇప్పటికిప్పుడు భయపడాల్సిందేమీ లేదని, కానీ ఇరాన్‌పై అమెరికా భీకర దాడికి ముందే ఇజ్రాయెల్‌ను వీడితే మంచిదని సూచించారు.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై దాడులకు దిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. తమతో అణుఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ట్రంప్ హెచ్చరికలు చేసినప్పటికీ అణు ఒప్పంద చర్చలు అంత ఫలప్రదంగా ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో అమెరికా రాయబారి ఇజ్రాయెల్‌లోని తన ఎంబసీకి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అమెరికా తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు అమెరికాకు స్పష్టం చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను నాశనం చేస్తామని ప్రకటించింది.


More Telugu News