తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. కూటమిలో కమల్ హాసన్ చేరడంతో మారనున్న సీట్ల లెక్క

త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి పొత్తుల విషయంలో చిక్కులు కనిపిస్తున్నాయి. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్‌పీఏ)లో సీట్ల పంపకాలకు సంబంధించి నేటి నుండి చర్చలు ప్రారంభం కానున్నాయి. 2021లో ఏ విధంగా అయితే పంపకాలు జరిగాయో ఈసారి అదే విధంగా ఉండాలని డీఎంకే కోరుకుంటోంది. అదే సమయంలో మిత్రపక్షాలు మరిన్ని ఎక్కువ సీట్లను ఆశిస్తున్నాయి.

2021లో 234 అసెంబ్లీ స్థానాలకు గాను డీఎంకే 188 పోటీ చేయగా, మిగిలిన సీట్లను మిత్ర పక్షాలకు ఇచ్చింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు తీసుకోగా, మిగిలిన పక్షాలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. ఈసారి కూటమిలోకి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం  (ఎంఎన్ఎం) పార్టీ వచ్చి చేరింది. ఇప్పటికే మిత్రపక్షాలు తాము కోరుకుంటున్న స్థానాలతో కూడిన జాబితాను డీఎంకేకు అందించినట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్‌కు పరిమితమైన తాము ఈసారి డబుల్ డిజిట్ సీట్లను కోరుకుంటున్నామని కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ సీట్లను ఆశిస్తోంది. డీఎండీకే పార్టీకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చింది. ప్రతిగా కమల్ హాసన్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఇప్పుడు డీఎంకే కూటమిలో చేరిన కమల్ హాసన్, తగిన సమయంలో తన పార్టీకి ఎన్ని సీట్లు కావాలో చెబుతానని ఇదివరకు ప్రకటించారు. అయితే డీఎంకే మాత్రం గత అసెంబ్లీలో పోటీ చేసిన స్థానాల కంటే తమకు తగ్గకూడదని కోరుకుంటోంది.

Kamal Haasan
Tamil Nadu Assembly Elections
DMK
Makkal Needhi Maiam
MNM
Congress Party

More Telugu News