Bhopal Family Court: సినిమాలోని కథ నిజ జీవితంలో జరిగింది.. భర్తను ప్రియురాలికి రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య
- భర్తతో 23 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించిన భార్య
- భోపాల్ లో ఆశ్చర్యకర సంఘటన
- కోర్టు సాక్షిగా భర్తను ప్రియురాలికి అప్పగించిన భార్య
ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఒక సినిమాలో భార్య తన భర్తను కోటి రూపాయలకు ప్రియురాలికి అమ్మేస్తుంది. ఆ సినిమాలో చూసినట్టుగానే నిజ జీవితంలోనూ జరిగింది. 23 ఏళ్ల వివాహ బంధాన్ని భార్య స్వయంగా ముగించి, తన భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అప్పగించింది. ఈ అసాధారణ ఒప్పందం భోపాల్ ఫ్యామిలీ కోర్టు సాక్షిగా జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వివరాల్లోకి వెళితే, 23 ఏళ్ల క్రితం ఈ భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ముగ్గురినీ కౌన్సెలింగ్కు పిలిచింది.
అయితే భర్త “నేను ఆమెతోనే ఉంటాను” అని స్పష్టం చేశాడు. దీంతో భార్య “నా భర్తను అతని ప్రియురాలికి వదిలిపెట్టడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలి” అని డిమాండ్ చేసింది. ప్రియురాలు అంగీకరించడంతో ఒప్పందం జరిగింది. భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఇవ్వడంతో పాటు, రూ.27 లక్షల నగదు చెల్లించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లో స్థిరపడేందుకు సిద్ధమవుతోంది.