ఈ సాయంత్రం భారత్-పాక్ మ్యాచ్... బీజేపీ, కాంగ్రెస్ మాటల తూటాలు!

  • భారత్-పాక్ టీ20 మ్యాచ్‌పై భిన్న రాజకీయ అభిప్రాయాలు
  • భారత్ గెలుపు ఖాయమంటూ బీజేపీ నేతల ధీమా
  • ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్‌తో మ్యాచ్ వద్దన్న కాంగ్రెస్
  • ఆటలను రాజకీయాలతో కలపవద్దని సీపీఎం హితవు
  • కొలంబోలో జరగనున్న మ్యాచ్‌పై తీవ్రస్థాయిలో చర్చ
ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌పై దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ మ్యాచ్‌పై అధికార, విపక్ష పార్టీల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీమిండియా చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ, దాని మిత్రపక్షాలు ధీమా వ్యక్తం చేస్తుండగా, సరిహద్దు ఉగ్రవాదం నేపథ్యంలో పాకిస్థాన్‌తో అసలు మ్యాచ్ ఆడటమేంటని కాంగ్రెస్ తీవ్రంగా ప్రశ్నిస్తోంది.

భారత్ తప్పకుండా గెలుస్తుందని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. "యుద్ధభూమిలో పాకిస్థాన్‌ను ఓడించాం, ఇప్పుడు క్రికెట్ మైదానంలోనూ మన జట్టు పాక్‌ను చిత్తు చేస్తుంది. ప్రతి విషయంలో భారత్ గొప్పదని నిరూపిస్తాం" అని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాల్ అన్నారు. ఇదే అభిప్రాయాన్ని లఢక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా, బీజేపీ నేత రవీంద్ర రైనా కూడా వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్ఠతో ముడిపడిన ఆటలో భారత్ గెలవాలని ఆకాంక్షించారు.

మరోవైపు, కాంగ్రెస్ ఈ మ్యాచ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల పహల్గాంలో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, పాక్‌తో మ్యాచ్ ఆడటం సరికాదని అంటోంది. "మన దేశంలోకి వచ్చి ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారితో మనం ఆటలు ఆడగలమా? శత్రువులతో ఆడేది రక్తపు హోలీ మాత్రమే" అని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దేశంతో దౌత్య సంబంధాలు లేనప్పుడు క్రికెట్ మ్యాచ్ ఎందుకని మరో సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో ప్రశ్నించారు.

అయితే, సీపీఎం మాత్రం ఈ మ్యాచ్‌ను స్వాగతించింది. ఆటలను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని సీపీఎం నేత హన్నన్ మొల్లా తెలిపారు. ఈ భిన్నాభిప్రాయాల మధ్య, కొలంబోలో మాత్రం మ్యాచ్ వాతావరణం వేడెక్కింది. దీంతో ఈ పోరు కేవలం క్రీడా పోటీగానే కాకుండా, రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News