మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ కు భంగపాటు

  • వివేక్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
  • సీపీఐతో పొత్తు పెట్టుకుని జయకేతనం ఎగురవేసిన బీఆర్ఎస్
  • ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు దాదాపు పూర్తయింది. ప్రస్తుతం వెలుడిన ఫలితాలు, కొనసాగుతున్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతను కనబరుస్తోంది. 


మరోవైపు, మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత నియోజకవర్గం చెన్నూర్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం ఇక్కడ ప్రధానంగా కలిసివచ్చింది. ఈ రెండు పార్టీల బలం కలిపి 14 సీట్లకు చేరడంతో మున్సిపల్ పీఠం దక్కించుకోవడం సులువైంది. మొత్తం 22 వార్డులు ఉన్న క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు, సీపీఐ 4 వార్డులు, ఇండిపెండెంట్ ఒక వార్డులో విజయం సాధించారు.

కేడర్‌ను సమన్వయం చేయడంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విజయవంతమయ్యారు. నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. మంత్రి వివేక్ ఇలాకా కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో సీపీఐతో పొత్తు కుదరకపోవడం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీశాయి. ఈ ఓటమిని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.



More Telugu News