జైలు భోజనం ముట్టని భగీరథ్.. పాలు, బ్రెడ్డుతోనే తొలిరోజు!

Bandi Sai Bhagirath Refuses Jail Food on First Day
  • పోక్సో కేసులో చర్లపల్లి జైలుకు బండి భగీరథ్
  • సాధారణ ఖైదీలతో కలిపి బ్యారక్‌లో ఉంచిన అధికారులు
  • 10 రోజుల కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు
  • విచారణకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు భగీరథ్ ఐఫోన్, ఇతర ఆధారాలు
పోక్సో కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌పై చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న బండి సాయి భగీరథ్‌ను అధికారులు సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా, విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌లోనే ఆయనను ఉంచారు. జైలులో తొలిరోజు ఆహారం తీసుకోలేదని, కేవలం జైలు క్యాంటీన్ నుంచి తెప్పించుకున్న పాలు, బ్రెడ్డుతోనే సరిపెట్టుకున్నారని తెలిసింది.

పోక్సో కేసులో కోర్టు రెండు వారాల రిమాండ్ విధించడంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేసిన అనంతరం నేరుగా విచారణ ఖైదీల బ్యారక్‌కు తరలించారు. ఆదివారం ఖైదీలకు పెట్టే మాంసాహారాన్ని కూడా భగీరథ్ తీసుకోలేదని సమాచారం. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఉన్న బ్యారక్‌ వైపు ఇతర ఖైదీలు వెళ్లకుండా సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను, బాధితురాలి తల్లి కోర్టుకు సమర్పించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు పంపాలని నిర్ణయించారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు భగీరథ్‌ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్‌ బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారం (మే 19) ఈ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

అరెస్టు, రిమాండ్ హడావుడిగా జరగడంతో కీలక వివరాలు సేకరించలేకపోయామని, కస్టడీలో విచారిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు పేర్కొన్న ప్రదేశాలకు నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కేసులో బాధితురాలి తల్లి ఫిర్యాదులో ప్రస్తావించిన కేంద్ర మాజీ మంత్రి బండి సంజయ్, మాజీ జర్నలిస్టు సంగప్పల నుంచి కూడా వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాల సమాచారం.
Go Back to Shorts
Bandi Sai Bhagirath
Bhagirath
POCSO case
Charlapalli Jail
Telangana news
Cyberabad police
SIT investigation
Forensic Science Lab
Bandi Sanjay
Pet Basheerabad police

More Telugu News