గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం

  • గడ్డపోతారంలో 18 వార్డులకు గాను 14 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
  • 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
  • నందికొండలో 12 వార్డులకు గాను 11 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది.

నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ 12 వార్డులు ఉండగా 11 చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీఆర్ఎస్ విజయం సాధించాయి. కాగా, ఈ వార్త రాసే సమయానికి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 121 స్థానాలు, బీఆర్ఎస్ 67, బీజేపీ 15, ఇతరులు 14 చోట్ల విజయం సాధించారు.

అందరూ సహకరించాలి: డీజీపీ

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల మేరకు సహకరించాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థుల, కార్యకర్తలు ఎవరైనా చట్టానికి అతీతులు కాదని అన్నారు. అధికారులపై ఫిర్యాదులు ఉంటే ఉన్నతాధికారులకు లేదా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.


More Telugu News