తిరుపతి లడ్డూ నెయ్యి: చంద్రబాబుపై భూమన ఆరోపణలు

  • తిరుపతి లడ్డూ నెయ్యి సరఫరాపై సీఎం చంద్రబాబును ప్రశ్నించిన భూమన
  • గతంలో హెరిటేజ్ సంస్థ రూ. 278కే నెయ్యి సరఫరా చేసిందని వెల్లడి
  • ఇప్పుడు అదే సంస్థ రూ. 658కి సరఫరా చేయడంపై తీవ్ర ఆరోపణలు
  • ధరల వ్యత్యాసం, నాణ్యతపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్
తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి ధర, నాణ్యత విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని వైసీపీ తీవ్రంగా విమర్శించింది. టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.

గతంలో 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ తయారీ యూనిట్ అయిన ఇందాపూర్ ఫుడ్స్ అండ్ డెయిరీ ప్రొడక్ట్స్.. టీటీడీకి కేజీ నెయ్యిని రూ. 278 నుంచి రూ. 306 ధరలకే సరఫరా చేసిందని భూమన గుర్తుచేశారు. రూ. 300 లోపు నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ఇప్పుడు ప్రశ్నిస్తున్న చంద్రబాబు, ఆనాడు సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆశ్చర్యకరంగా, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే యూనిట్ సరఫరాదారుగా వచ్చి, ఇప్పుడు కేజీ నెయ్యిని ఏకంగా రూ. 658కి సరఫరా చేస్తోందని భూమన ఆరోపించారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెరిటేజ్ తయారీ యూనిట్, కర్ణాటకకు చెందిన మరో సంస్థతో కలిసి టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోందని తెలిపారు.

గతంలో రూ. 278కి సరఫరా చేసినప్పుడు నాణ్యమైనదిగా భావించి, ఇప్పుడు ధరను రూ. 658కి ఎలా పెంచారని.. దీని వెనుక ఏదైనా వ్యాపార ఒప్పందం ఉందా అని సీఎం సమాధానం చెప్పాలని భూమన నిలదీశారు. గతంలో చంద్రబాబు హయాంలో ఈ రెండు యూనిట్లు 40 లక్షల కేజీలకు పైగా నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఉందని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని భూమన డిమాండ్ చేశారు.


More Telugu News