ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్

Chandrababu Naidu Reviews Revenue Departments Target 127 Lakh Crores
  • ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
  • 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.27 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం
  • గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగిన రాష్ట్ర సొంత ఆదాయం
  • లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  • ప్రభుత్వ సొమ్ము సద్వినియోగం కావాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,27,506 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తూ, ఆ దిశగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. రాష్ట్ర సొంత ఆదాయం (స్టేట్ ఓన్ రెవెన్యూస్) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,04,345 కోట్లుగా ఉండగా, 2025-26 నాటికి అది రూ. 1,10,643 కోట్లకు చేరినట్లు తెలిపారు. తద్వారా గత ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ. 33,679 కోట్లు, గనుల శాఖ నుంచి రూ. 10,300 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 11,047 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలు పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయి ప్రజలకు సద్వినియోగం కావాలని, ఆ దిశగా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్ధిక, రవాణా, ఎక్సైజ్, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, అటవీ, పురపాలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP Revenue
State Revenue
GST
Mines Department
Stamps and Registration
Excise Department
Tax Revenue
Sai Prasad

More Telugu News