Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

Ayyanna Patrudu Implements Key Decision on AP Assembly Attendance
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైర్హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంత వరకు సబబని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఉన్న విచక్షణాధికారాలతో హాజరు విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.
 
అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరైనట్టు పరిగణనలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకే డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 
Go Back to Shorts
Ayyanna Patrudu
AP Assembly
Andhra Pradesh Assembly
AP Budget Session
YSRCP MLAs
MLA Attendance
Digital Attendance
AP Speaker
Chintakayala Ayyanna Patrudu
AP Politics

More Telugu News