మెదక్ జిల్లాలో కలకలం రేపుతున్న చిరుత సంచారం

  • అల్లాదుర్గం మండలంలో జాతీయ రహదారి పక్కన చిరుత సంచారం 
  • అధికారులకు సమాచారం అందించిన స్థానికులు 
  • సమీప తండాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు 
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అకోలా - హైదరాబాద్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి చిరుత సంచరిస్తున్నట్లు పలువురు గుర్తించారు. సర్వీసు రోడ్డుపై తిరుగుతున్న చిరుతను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న తహసీల్దార్ మల్లయ్య, ఎస్‌ఐ శంకర్, ఏఎస్‌ఐ గాలయ్యలు అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు వివరాలు తెలియజేశారు. చిరుత ఎవరికి ఎలాంటి హాని తలపెడుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గొల్లకుంట తండా, గాండ్లబాయి తండా, మాందాపూర్, చిల్వేర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.


More Telugu News