ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు.. తెలంగాణకు ఏం ఇచ్చారు?: పొన్నం ప్రభాకర్
- జనగణన ఫారమ్లలో లోపాలు ఉన్నాయన్న పొన్నం
- బీసీలను విస్మరించారని విమర్శ
- గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన, హౌస్ హోల్డ్ సర్వే ఫారమ్లలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే ఫారమ్లో కేవలం ఎస్సీ, ఎస్టీ అనే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, మెజారిటీ జనాభా కలిగిన బీసీల ప్రస్తావనే లేకపోవడం వారిని విస్మరించడమేనని మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి కులగణన అత్యవసరమని, కేంద్రం ఈ విషయంలో వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ, "రాష్ట్రానికి ఏం ప్రాజెక్టులు ఇస్తారో చెప్పకుండా, బంగారం కొనొద్దు అని సలహాలు ఇవ్వడానికే మోదీ వచ్చారా?" అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా నిధుల విడుదలపై స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాముడిని తాము కూడా పూజిస్తామని, అయితే బీజేపీలాగా ఓట్ల కోసం దేవుడిని వాడుకోమని స్పష్టం చేశారు.