Shehbaz Sharif: టీ20 వరల్డ్ కప్.. భారత్‌తో మ్యాచ్‌పై మౌనం వీడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

T20 World Cup Shehbaz Sharif Clarifies Pakistans Decision on India Match
  • భారత్‌తో మ్యాచ్‌కు పాక్ దూరం
  • బంగ్లాదేశ్‌కు మద్దతుగా ప్రధాని నిర్ణయం
  • ఐసీసీ నిబంధనల ఉల్లంఘన హెచ్చరిక బేఖాతరు
  • భారత్‌కు దక్కనున్న వాకోవర్ పాయింట్లు
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే విషయంపై  కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెరదించారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆయన తన మౌనాన్ని వీడుతూ పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

"భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని మేము ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాం. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు, అన్ని కోణాల్లో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. ప్రస్తుతం మేము బంగ్లాదేశ్‌కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాం" అని షరీఫ్ పేర్కొన్నారు.

భారత్‌లో భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ కోరగా, ఐసీసీ అందుకు నిరాకరించింది. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది.

పాక్ ప్రధాని వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఘాటుగా స్పందించింది. వరల్డ్ కప్ లాంటి అంతర్జాతీయ టోర్నీల్లో జట్లు తమకు నచ్చిన మ్యాచ్‌లే ఆడతామనడం కుదరదని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ పాక్ గనుక మ్యాచ్‌ను బహిష్కరిస్తే, పీసీబీకి వచ్చే వార్షిక ఆదాయంలో కోత విధించడంతో పాటు, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల నిర్వహణ హక్కులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల ప్రయోజనాలను దెబ్బతీయొద్దని హితవు పలికింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు షెడ్యూల్ ప్రకారం మైదానంలోకి రాకపోతే, ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ లభిస్తుంది. అంటే, భారత్ ఆడకుండానే 2 పాయింట్లు సాధిస్తుంది. అయితే, క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ మ్యాచ్ రద్దు కావడం బ్రాడ్‌కాస్టర్లకు, ఐసీసీకి కోలుకోలేని దెబ్బే. ప్రస్తుతానికి పాక్ జట్టు శ్రీలంక చేరుకున్నప్పటికీ, ఫిబ్రవరి 15న వారు భారత్‌తో తలపడతారా లేదా అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది. 

More Telugu News

Shehbaz Sharif
T20 World Cup
India vs Pakistan
Pakistan boycott
ICC
Bangladesh cricket
Sri Lanka
Cricket politics
PCB
Cricket broadcasting