Pakistan Cricket: భారత్‌కు ఉచితంగా 2 పాయింట్లు.. పాక్‌కు భారీ జరిమానా?

Pakistan Cricket Team Facing Heavy Penalties Over India Match
  • టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదన్న పాక్
  • టాస్ సమయానికి పాక్ రాకపోతే భారత్ విజేత
  • రూ. 500 కోట్ల వరకు పీసీబీకి జరిమానా పడే ఛాన్స్
  • పీఎస్ఎల్ విదేశీ ప్లేయర్లపై ఐసీసీ ఆంక్షలు?
టీ20 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 15న జరగాల్సిన దాయాదుల పోరు ఇప్పుడు క్రికెట్ మైదానం నుంచి ఐసీసీ రూల్ బుక్ లోకి మారింది. భారత్‌తో ఆడేది లేదంటూ పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న మొండి నిర్ణయం ఆ దేశ క్రికెట్ బోర్డును (పీసీబీ) కోలుకోలేని దెబ్బ తీసేలా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాక్ కనుక మైదానంలోకి దిగకపోతే, భారత్‌కు లాభం.. పాక్‌కు భారీ నష్టం తప్పదు.

ఐసీసీ క్లాజ్ 16.10.7 ప్రకారం ఒక జట్టు ఆడటానికి నిరాకరిస్తే దాన్ని 'ఫోర్ఫిట్'లేదా 'వాకోవర్'గా పరిగణిస్తారు. ఒక్క బంతి పడకుండానే భారత్‌కు 2 పాయింట్లు లభిస్తాయి. పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో సున్నా పరుగులకే ఆలౌట్ అయినట్లు పరిగణించి వారి రన్ రేట్‌ను తగ్గిస్తారు. ఇది వారిని సెమీస్ రేసు నుంచి తప్పించే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్ రద్దు వల్ల బ్రాడ్‌కాస్టర్లకు, స్పాన్సర్లకు కలిగే నష్టం సుమారు రూ. 4,500 కోట్లు ఉంటుందని అంచనా.

ఈ వాణిజ్య నష్టాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు సుమారు 38 మిలియన్ డాలర్ల (రూ. 320 కోట్లు) జరిమానా విధించే అవకాశం ఉంది. ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు వచ్చే వార్షిక ఆదాయంలో (సుమారు 34.5 మిలియన్ డాలర్లు) 70-80 శాతం కోత విధించవచ్చని సమాచారం. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే ఎన్‌వోసీలను ఐసీసీ నిలిపివేసేలా ఇతర బోర్డులపై ఒత్తిడి తెచ్చే ఛాన్స్ ఉంది.

పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఈ విషయంపై స్పందిస్తూ.. "ప్రభుత్వ నిర్ణయాన్ని మేము కాదనలేము, ఆటగాళ్లుగా మా చేతుల్లో ఏమీ లేదు" అని నిస్సహాయత వ్యక్తం చేశాడు. మరోవైపు, భారత్ మాత్రం 'సేఫ్ జోన్'లో ఉంది. రోహిత్ శర్మ సేన షెడ్యూల్ ప్రకారం కొలంబో చేరుకుని ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనబోతోంది. టాస్ సమయానికి టీమిండియా మైదానంలో ఉండి, పాక్ రాకపోతే అంపైర్లు అధికారికంగా భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు.

పాకిస్థాన్ గనుక ఈ వైఖరిని వీడకపోతే, వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను కూడా రద్దు చేసే దిశగా ఐసీసీ ఆలోచిస్తోంది. అంతేకాకుండా, పాకిస్థాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం కూడా ఐసీసీకి ఉంది.
Pakistan Cricket
T20 World Cup
ICC
India vs Pakistan
Salman Ali Agha
PCB
Cricket
Champions Trophy
Rohit Sharma

More Telugu News