అమృత్ భారత్ రైళ్లు: స్లీపర్ క్లాస్‌లో ఆర్ఏసీ రద్దు.. మారిన టికెట్ నిబంధనలు

Amrit Bharat Express Sleeper Class RAC Cancelled Ticket Rule Changes
  • సెకండ్ క్లాస్‌లో కనీస ఛార్జీ రూ.36గా నిర్ధారణ
  • స్లీపర్ క్లాస్‌లో 200 కి.మీ వరకు కనీస ఛార్జీ రూ.149గా నిర్ణయం
  • ఈ నెలలో రానున్న కొత్త రైళ్లకు ఈ నిబంధనలు వర్తింపు
  • ప్రయాణికులకు ఇకపై కన్ఫర్మ్ బెర్తులు మాత్రమే కేటాయింపు  
సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో భారతీయ రైల్వే కీలక మార్పులు చేసింది. ఈ నెలలో పట్టాలెక్కనున్న కొత్త "అమృత్ భారత్ II" రైళ్లలో టికెటింగ్ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా, స్లీపర్ క్లాస్‌లో రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (RAC) విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్ బెర్తులు మాత్రమే కేటాయిస్తారు.

కొత్త నిబంధనల ప్రకారం, అమృత్ భారత్ II రైళ్లలో కనీస ప్రయాణ దూరానికి ఛార్జీల విధానాన్ని కూడా రైల్వే బోర్డు మార్చింది. సెకండ్ క్లాస్‌లో కనీసం 50 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కనీస బేస్ ఫేర్ రూ.36గా నిర్ణయించారు. అదేవిధంగా, స్లీపర్ క్లాస్‌లో కనీస ఛార్జీ దూరాన్ని 200 కిలోమీటర్లుగా నిర్ధారించారు. దీనికి కనీస బేస్ ఫేర్ రూ.149గా ఉంటుంది. ప్రయాణ దూరం ఇంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఈ కనీస ఛార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రయాణికులకు ఆర్ఏసీ బెర్తులపై ఉండే అనిశ్చితిని తొలగించి, బుకింగ్ ప్రారంభం నుంచే కన్ఫర్మ్ బెర్తులను అందించాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ బేస్ ఫేర్‌కు రిజర్వేషన్ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ వంటి ఇతర రుసుములు అదనంగా ఉంటాయని రైల్వే బోర్డు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ మార్పులకు అనుగుణంగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) తన సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయనుంది. పుష్-పుల్ టెక్నాలజీతో నడిచే ఈ రైళ్లు తక్కువ ప్రయాణ సమయంలో గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, మెరుగైన సౌకర్యాలను అందిస్తాయి.
Go Back to Shorts
Amrit Bharat Express
Indian Railways
Amrit Bharat II
RAC cancellation
Sleeper class
Ticket rules
Minimum fare
Railway Board
CRIS
Push pull technology

More Telugu News