అస్సాంలో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు

  • అస్సా‌ం, త్రిపురల్లో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం  
  • అస్సాంలోని మెరిగావ్ ప్రాంతంలో భూకంప తీవ్రత 5.1గా నమోదు
  • త్రిపురలోని గోమతి ప్రాంతంలో తీవ్రత 3.9గా నమోదైందన్న ఎన్‌సీఎస్  
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఉండగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లు తెలిపింది.

అదే సమయంలో త్రిపురలో కూడా స్వల్ప భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ ప్రకటించింది. గోమతి ప్రాంతంలో సుమారు 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం.

అయితే ఈ భూకంప ఘటనలతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 


More Telugu News