Uttarakhand: విద్యుత్ కోతలపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే వినూత్న నిరసన.. వీడియో ఇదిగో!

విద్యుత్ కోతలపై ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే ఒకరు వినూత్నంగా నిరసన తెలియజేశారు. విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి వారి నివాసాలకు కరెంట్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
 
విద్యుత్ కోతలపై ఝాబ్రేరా నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఏరియాలో నిత్యం 5 నుంచి 8 గంటలు కోత పెడుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని మీడియాకు తెలిపారు. పది రోజుల కింద ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఆయన చెప్పారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే వీరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే వీరేంద్ర స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నివాసాలకు కరెంట్ కట్ చేశారు. బోట్‌ క్లబ్‌లోని సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వివేక్‌ రాజ్‌పుత్‌ అధికార నివాసంతో పాటు చీఫ్‌ ఇంజినీర్‌ అనుపమ్‌ సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వినోద్‌ పాండేల ఇళ్లకు కూడా ఆయన కరెంట్‌ కట్‌ చేశారు. కాగా, ముందస్తు చర్యలు లేకుండా కరెంటు లైన్లను కత్తిరించారని, ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందంటూ విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యే వీరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Uttarakhand
Power cuts
Haridwar
Congress MLA
Electricity department
Power outage protest
Electricity officials
Vivek Rajput
Anupam Singh

More Telugu News