ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. మూడో రోజూ 'పూర్' కేటగిరీలోనే గాలి నాణ్యత
- 285కు చేరిన వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)
- నగరంలోని పదికి పైగా ప్రాంతాల్లో 300 దాటిన కాలుష్యం
- కనీస ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందన్న ఐఎండీ
నగరంలోని పదికి పైగా పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ ఇప్పటికే 300 మార్కును దాటి 'వెరీ పూర్' కేటగిరీలో నమోదైంది. ఆనంద్ విహార్లో 300, అశోక్ విహార్లో 328, చాందినీ చౌక్లో 305, ఐటీఓ వద్ద 309గా కాలుష్య తీవ్రత రికార్డయింది. ఢిల్లీని ఆనుకుని ఉన్న నోయిడాలో సగటు ఏక్యూఐ 294గా ఉండగా, గ్రేటర్ నోయిడాలోని కొన్ని ప్రాంతాల్లో 331 వరకు నమోదైంది.
బుధవారం నగర సగటు ఏక్యూఐ 259గా, మంగళవారం 282గా నమోదైంది. అంతకుముందు తొమ్మిది రోజుల పాటు 'వెరీ పూర్' జోన్లో ఉన్న గాలి నాణ్యత, గాలుల వేగం పెరగడంతో స్వల్పంగా మెరుగుపడింది. అయితే, ఆ ఊరట ఎక్కువ కాలం నిలవలేదు.
వాయు కాలుష్యంతో పాటు నగరంలో చలి తీవ్రత కూడా పెరిగింది. బుధవారం కనీస ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గురువారం ఉదయం పొగమంచు ఉంటుందని, కనీస ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రానున్న రెండు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.