ఇకపై తమ ఆలయంలో వివాహాలు చేయకూడదని నిర్ణయించిన అర్చకులు.. ఎందుకంటే..!

ఇకపై తమ ఆలయంలో వివాహాలు చేయకూడదని నిర్ణయించిన అర్చకులు.. ఎందుకంటే..!

  • బెంగళూరులోని హలసూరు సోమేశ్వర స్వామి ఆలయం నిర్వహణ కమిటీ నిర్ణయం
  • విడాకుల కేసులు పెరగడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న పూజారులు
  • ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని అర్చకుల ఆవేదన
  • ఆలయ కమిటీ నిర్ణయంపై భక్తుల మిశ్రమ స్పందన
వివాహ క్రతువుతో వేల జంటలను కలిపిన బెంగళూరులోని ఓ ప్రముఖ ఆలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ఇకపై వివాహాలు చేయకూడదని అధికారులు, అర్చకులు నిర్ణయించారు. వివాహం చేసుకున్న జంటలు కొన్ని రోజులకే విడాకులు తీసుకోవడం, తప్పుడు పత్రాలతో పెళ్లి చేసుకోవడం వల్ల కోర్టుల్లో కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని చెప్పారు. దీంతో వారి వివాహం జరిపించిన అర్చకులు విచారణ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోయారు. ఆలయంలో నిత్య పూజల కన్నా కోర్టులకు వెళ్లడమే ఎక్కువవుతోందని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇకపై పెళ్లిళ్లు జరపకూడదని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
 
బెంగళూరు నగరంలోని పురాతన హలసూరు సోమేశ్వర స్వామి ఆలయంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రేమ జంటలతో పాటు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకూ ఈ ఆలయం వేదికగా మారింది. అయితే, ఇటీవల విడాకుల కేసులు పెరిగిపోవడంతో ఆ పెళ్లి జరిపించిన ఆలయ పూజారులనూ కోర్టు విచారణకు పిలుస్తోంది. దీంతో పూజారులు కోర్టుల్లోనే ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెళ్లి కోసం ప్రేమ జంటలు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించడం వల్ల కేసుల్లో ఇరుక్కుంటున్నట్లు పూజారులు తెలిపారు. దీనివల్ల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రతిష్ఠను, పూజారుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆలయ పరిసరాల్లో వివాహ వేడుకలపై నిషేధం విధించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. అయితే భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించే అవకాశం ఉందని తెలిపింది. శతాబ్దాల సంప్రదాయాన్ని ఇప్పుడు నిలిపివేయడంపై భక్తులు, ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఆలయ పవిత్రతను కాపాడటానికి, పూజారుల సమయాన్ని దైవారాధనకు వినియోగించడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు భక్తులు అభినందించారు. మరికొందరు మాత్రం.. ఈ నిర్ణయం సాంస్కృతిక ఆచారాలను దెబ్బతీసేదిగా వుందని అభిప్రాయపడ్డారు.
Advertisement

More Telugu News