హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు.. పక్కా హత్యే: లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

  • హిడ్మాది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపించిన మావోయిస్టులు
  • చికిత్స కోసం విజయవాడ వస్తే అరెస్టు చేసి చంపేశారని ఆరోపణ
  • హిడ్మా హత్యకు దేవ్‌జీ కారణమన్న ప్రచారాన్ని ఖండించిన మావోయిస్టు పార్టీ
‘ఆపరేషన్ కగార్‌’లో భాగంగా ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన ఆరోపణలతో కూడిన ఓ లేఖను విడుదల చేసింది. తమ కీలక నేత హిడ్మాతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చంపారని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆ లేఖలో తీవ్రంగా ఆరోపించింది.

వికల్ప్ పేరుతో విడుదలైన ఈ లేఖ ప్రకారం, అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడ వచ్చిన హిడ్మాను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలతో పాటు రంపచోడవరం పరిధిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారని, 50 మందిని అరెస్టు చేశారని తెలిపారు.

హిడ్మా కదలికల గురించి లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూత్రధారత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వర్గాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని విమర్శించింది. అదే సమయంలో, హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇది పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమని పేర్కొంది.

‘ఆపరేషన్ కగార్‌’ను వెంటనే నిలిపివేయాలని, ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అరెస్టు అయిన 50 మందికి న్యాయ సహాయం అందించాలని హక్కుల సంఘాలకు విజ్ఞప్తి చేసింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, విప్లవోద్యమానికి అండగా నిలవాలని పిలుపునిచ్చింది.


More Telugu News