మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా.. ఆయన హోటల్‌కే వెళ్లలేదు: నటి మీనా

  • బాలీవుడ్ అవకాశాలపై స్పందించిన సీనియర్ నటి మీనా
  • మిథున్ చక్రవర్తి తనతో నటించమని తరచూ అడిగేవారని వెల్లడి
  • ఆయన అడుగుతారనే భయంతో ఆయన హోటల్‌కు వెళ్లడం మానేశానన్న మీనా
  • దక్షిణాదిలో బిజీగా ఉండటం వల్లే హిందీ సినిమాలు చేయలేకపోయానని వెల్లడి
  • ఒకేరోజు నాలుగు షిఫ్టుల్లో పనిచేయడంతో తీరిక ఉండేది కాదన్న మీనా
సీనియర్ నటి మీనా తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందుకు చేయలేకపోయానో వివరించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి సంబంధించిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

"ఆ రోజుల్లో షూటింగ్‌ల కోసం ఊటీకి తరచూ వెళ్లేదాన్ని. అక్కడ మిథున్ చక్రవర్తి గారికి ఒక హోటల్ ఉండేది. నేను ఎప్పుడు వెళ్లినా అక్కడే బస చేసేదాన్ని. నేను హోటల్‌కు వచ్చిన ప్రతిసారీ ఆయన నా గది దగ్గరకు వచ్చి 'నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్?' అని అడిగేవారు. కానీ డేట్లు సర్దుబాటు కాక నేను ఒప్పుకోలేకపోయేదాన్ని. ఆయన అలా పదే పదే అడగటంతో, ఒకానొక దశలో ఆ హోటల్‌కు వెళ్లాలంటేనే భయపడేదాన్ని. ఆ తర్వాత నుంచి నా వాళ్లకు ఆ హోటల్‌లో రూమ్ బుక్ చేయవద్దని చెప్పేదాన్ని. అంత పెద్ద స్టార్ హీరో అన్నిసార్లు అడిగినా చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డాను" అని మీనా చెప్పుకొచ్చారు.

తాను హిందీ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటానికి గల కారణాలను కూడా ఆమె వివరించారు. "తెలుగు, తమిళ భాషల్లో నేను అత్యంత బిజీగా ఉన్న సమయంలోనే హిందీ నుంచి అవకాశాలు వచ్చాయి. ఒక్కోసారి రోజుకు నాలుగు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అలాంటి సమయంలో బాలీవుడ్ సినిమా చేయడం నా వల్ల కాలేదు. అంతేకాకుండా, బాలీవుడ్ సినిమాల షూటింగ్‌కు చాలా సమయం పడుతుందని, అనుకున్న సమయానికి పూర్తికావని అప్పట్లో అందరూ నన్ను భయపెట్టారు. దాంతో అటువైపు చూడాలన్న ఆలోచన కూడా చేయలేదు" అని మీనా తెలిపారు.

కాగా, మీనా తన సుదీర్ఘ కెరీర్‌లో 'పర్దా హై పర్దా' అనే ఒక్క హిందీ చిత్రంలోనే నటించడం గమనార్హం. దక్షిణాది భాషల్లో మాత్రం ఆమె అగ్రతారగా ఎంతో కాలం ప్రేక్షకులను మెప్పించారు. 


More Telugu News