త్రివిధ దళాలకు కొత్త బలం.. రూ.79,000 కోట్ల రక్షణ కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం

Defense Ministry approves Rs 79000 crore acquisitions
షార్ట్స్‌లో చూడండి
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల ఆధునికీకరణ కోసం సుమారు రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాలు, ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో రూ.67,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు మరో భారీ కొనుగోలుకు సిద్ధమైంది.

ఏ దళానికి ఏ అస్త్రాలు?
ఈ కొత్త కొనుగోళ్లలో భాగంగా భారత నౌకాదళం కోసం అత్యాధునిక ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్ (ఎల్‌పీడీ), నావల్ సర్ఫేస్ గన్స్, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలు, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రా-రెడ్ సెర్చ్ సిస్టమ్స్ వంటివి సమకూర్చనున్నారు. ఎల్‌పీడీల ద్వారా ఆర్మీ, వైమానిక దళాలతో కలిసి నౌకాదళం ఉభయచర కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ టార్పెడోలు సంప్రదాయ, అణు జలాంతర్గాములను సైతం లక్ష్యంగా చేసుకోగలవు.

ఇక, సైన్యం కోసం 2,408 ట్యాంక్ విధ్వంసక 'నాగ్ మార్క్-2' గైడెడ్ క్షిపణులను కొనుగోలు చేయనున్నారు. వీటితో శత్రువుల యుద్ధ వాహనాలు, బంకర్లను సులభంగా ధ్వంసం చేయవచ్చు. దీంతో పాటు భూతలం నుంచి శత్రువుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు మొబైల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కూడా సమకూర్చుకోనున్నారు. అదేవిధంగా, వైమానిక దళం కోసం లాంగ్ రేంజ్ టార్గెటింగ్ సిస్టమ్‌ల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.

పదాతిదళానికి డ్రోన్ల బలం
మరోవైపు, భారత సైన్యంలోని 380 పదాతిదళ బెటాలియన్లను 'ఆష్ని' డ్రోన్ ప్లాటూన్లతో అనుసంధానం చేసినట్లు పదాతిదళ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ వెల్లడించారు. సరిహద్దుల్లో సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచే ఆధునికీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి బెటాలియన్‌కు కేటాయించే ప్లాటూన్‌లో కనీసం నాలుగు నిఘా డ్రోన్లు ఉంటాయని వివరించారు. దీనితో పాటు రూ.2,770 కోట్లతో 4.25 లక్షల తుపాకులను కూడా కొనుగోలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Rajnath Singh
Indian defense
defense acquisitions
military equipment
arms procurement
Indian Navy
DRDO
Nag Mark 2
Ashni drones
Indian Army

More Telugu News