నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు రూ. 250 కోట్లు విడుద‌ల చేసిన ఏపీ సర్కార్

  • త్వ‌ర‌లో మ‌రో రూ.250 కోట్లు చెల్లిస్తామన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి 
  • వెంట‌నే ఆందోళ‌న విర‌మించాలని యాజ‌మాన్య సంఘాలకు వినతి 
  • నిధుల చెల్లింపులపై ఆర్దిక మంత్రి పయ్యావులతో చర్చించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ (నెట్‌వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. బకాయిలు పేరుకుపోవడంతో ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో పేద వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నిధుల చెల్లింపులపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చించారు. దీంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.

అలాగే త్వరలో మరో రూ.250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైద్య సేవల్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్, ఇతర సంఘాల ప్రతినిధులను సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆందోళన విరమించాలని యాజమాన్య సంఘాల వారికి ప్రభుత్వం కోరింది. 


More Telugu News