Saeed Khatibzadeh: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఆటంకం కలిగించడం లేదు: ఇరాన్
- హిందూ మహాసముద్రంలో తమ నౌకలపై జరుగుతున్న దాడిని భారత్ అడ్డుకోవాలన్న ఇరాన్
- అంతర్జాతీయ జలాల్లో అమెరికా తీరు ప్రమాదకరంగా ఉందన్న ఇరాన్ మంత్రి
- భారత్, ఇరాన్ మనస్తత్వం ఒకటేనని వ్యాఖ్య
హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జాదే ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, భారత నౌకలను తాము అడ్డుకుంటున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలపై జరుగుతున్న దాడుల విషయంలో భారత్ చొరవ తీసుకోవాలని, ఈ దాడులకు కారణమైన అమెరికాను ప్రశ్నించాలని ఆయన సూచించారు.
హోర్ముజ్ జలసంధిలో స్థిరత్వం కోసం ఇరాన్ నిరంతరం ప్రయత్నిస్తుందని, ఒకవేళ ఆ జలసంధిని మూసివేయాల్సి వస్తే తామే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదని, తమది బాధ్యతాయుతమైన దేశమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా తీరు ప్రమాదకరంగా ఉందని, ఆ దేశపు "ఫుట్బాల్ మెంటాలిటీ" (దూకుడు స్వభావం) వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. భారత్, ఇరాన్ దేశాలు "చదరంగం" ఆడే మనస్తత్వం కలవని, అంటే దౌత్యపరమైన ఆలోచనలతో, వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన అభివర్ణించారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి దౌత్యమే సరైన మార్గమని, వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు.