కె-ర్యాంప్ రేటింగ్స్‌పై నిర్మాత ఆవేదన

  • కె-ర్యాంప్ మూవీ థాంక్స్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మాత రాజేశ్ దండా
  • సమీక్షకులు రేటింగ్ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన
  • బాహుబలి అయినా ‘కె- ర్యాంప్‌’ అయినా సమీక్షకులు సమానంగా చూడాలని వినతి
శనివారం విడుదలైన ‘కె- ర్యాంప్‌’ సినిమాకు తక్కువ రేటింగ్స్‌ రావడంతో నిర్మాత రాజేశ్‌ దండా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మూవీ థాంక్స్ మీట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామని, ఇందులో లాజిక్స్‌ కోసం వెతకాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయం ఉండొచ్చు కానీ పక్షపాతం మాత్రం సరికాదని ఆయన అన్నారు. కొందరు సమీక్షకులు ఒక సినిమాకు తక్షణమే రివ్యూలు ఇస్తున్నారు, మరికొన్ని సినిమాల విషయంలో మాత్రం గంటల తర్వాత రేటింగ్‌ నిర్ణయిస్తున్నారు. ఈ ద్వంద్వ ధోరణి ఎందుకని ఆయన ప్రశ్నించారు. చిన్న నిర్మాత కాబట్టి ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది నా ఒక్కరి బాధ కాదు, మా వంటి చిన్న నిర్మాతలందరి సమస్య అని రాజేశ్‌ దండా పేర్కొన్నారు. పక్షపాతం చూపడం తనకు బాధ కలిగిస్తుందన్నారు. బాహుబలి అయినా ‘కె- ర్యాంప్‌’ అయినా సమీక్షకులు సమానంగా చూడాలని కోరారు.

సినిమా వినోదం కోసం తీశామని, ప్రేక్షకులే తమకు న్యాయనిర్ణేతలని వారే సినిమాను ముందుకు తీసుకెళ్తారని రాజేశ్ దండా ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, సినిమా హీరో కిరణ్‌ అబ్బవరం కూడా నిర్మాత అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. 


More Telugu News