20 సెంట్ల భూమిలో 20 రకాల పంటలు.. నెలనెలా 10 వేల ఆదాయం

  • రాయలసీమ రైతు అద్భుతం.. పకృతి సేద్యంతో లాభాలు
  • కూరగాయలు, ఆకు కూరలు పండిస్తూ గ్రామంలోనే అమ్మకం
  • తక్కువ స్థలంలో ఎక్కువ రకాల పంటలు పండించవచ్చని నిరూపిస్తున్న రైతు
ఇరవై సెంట్ల భూమిలో మహా అంటే ఒకటీ రెండు రకాల కూరగాయలు సాగు చేసి నామ మాత్రం ఆదాయం పొందవచ్చు.. కానీ రాయలసీమకు చెందిన ఓ రైతు మాత్రం ఉన్న ఆ కాస్త భూమిలోనే ఏకంగా 20 రకాల కూరగాయలు, ఆకు కూరలు పండిస్తూ నెలనెలా రూ.10 వేలు ఆర్జిస్తున్నాడు. పురుగు మందుల జోలికి వెళ్లకుండా, కూలీలపై ఆధారపడకుండా ప్రకృతి సేద్యంతో కూరగాయలను పండిస్తున్నారు. వాటిని నేరుగా వినియోగదారులకు అమ్ముతూ దళారుల ప్రమేయం లేకుండా లాభాలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువుకు చెందిన రైతు రమేష్ కు 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో తీగజాతి పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలను రమేష్ పండిస్తున్నారు. పొలం చుట్టూ తీగజాతి పంటలు, మధ్యలో పసుపు, టమాటా, మిర్చి, బెండ, వంకాయలు.. వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. పురుగుల బెడదను తగ్గించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగిస్తున్నట్లు రమేష్ చెప్పారు. వైవిధ్యమైన సాగు పద్ధతి వల్ల ఆయనకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుందని వివరించారు. 
 
ఇరవై సెంట్లలో పండిస్తున్న పంటలు ఇవే..
వంకాయ, మిరప, టమాట, అలసంద, సొరకాయ, బీర, గుమ్మడి, పాలకూర, చుక్కకూర, నల్ల కుసుము, ఆవాలు, బంతిపూలు, పసుపు, సిరి ఆకు, తోటకూర, మటిక, బెండ, కంది, జనుము, కాకర.


More Telugu News