Masoud Pezeshkian: కొన్ని దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నాయి: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

Masoud Pezeshkian Iran President Says Some Countries Trying to Mediate
  • అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు
  • కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయన్న మసూద్ పెజెష్కియాన్
  • ఇజ్రాయెల్ పైకి అత్యాధునిక ఖోరంషహర్-4 క్షిపణుల ప్రయోగం
  • ఇరాన్ నేవీని నామరూపాల్లేకుండా చేశామన్న అమెరికా
  • భారీ బాంబులతో ఇరాన్ అణు కేంద్రాలపై విరుచుకుపడ్డ బి-2 బాంబర్లు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత తీవ్రతరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు "కొన్ని దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాయి" అని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రాంతీయ శాంతికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇరాన్ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేసిన వారికి ఈ మధ్యవర్తిత్వం సరైన సమాధానం కావాలని ఆయన 'ఎక్స్' వేదికగా స్పష్టం చేశారు. తమ దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

కొనసాగుతున్న ఇరాన్ ప్రతీకారం
అధ్యక్షుడి ప్రకటన ఒకవైపు ఉండగా.. క్షేత్రస్థాయిలో ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన 'ఖొర్రమ్‌షహర్-4' బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. "ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4"లో భాగంగా 22వ విడత దాడులు మొదలయ్యాయని, ఇవి నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడుతున్నాయని ఇస్లామిక్ రెవెల్యూషన్ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) తెలిపింది. మరోవైపు, లెబనాన్‌లోని సిడాన్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఓ నివాస భవనం దెబ్బతిన్నట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

విరుచుకుపడుతున్న అమెరికా 'ఎపిక్ ఫ్యూరీ'
మరోవైపు, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'ని మరింత ఉధృతం చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఉన్న సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ నావికాదళాన్ని, క్షిపణి కేంద్రాలను తమ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని తెలిపారు. "మేము ఈ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, విజయం సాధించే దిశగా వెళ్తున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరాన్‌కు భారీ నష్టం: అమెరికా ప్రకటన
ఈ ఆపరేషన్ ఆరో రోజుకు చేరుకుందని, ఇరాన్ మిలటరీ సామర్థ్యం గణనీయంగా తగ్గిందని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు.
* గత 72 గంటల్లో టెహ్రాన్ పరిసరాల్లోని దాదాపు 200 లక్ష్యాలపై అమెరికా బాంబర్లు దాడులు చేశాయి.
* భూగర్భంలో దాచిన క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసేందుకు బీ-2 బాంబర్ల ద్వారా 2000 పౌండ్ల బాంబులను జారవిడిచారు.
* ఇప్పటివరకు 30కి పైగా ఇరాన్ నౌకలను సముద్రంలో ముంచేశారు. ఇందులో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పరిమాణంలో ఉన్న ఓ భారీ డ్రోన్ క్యారియర్ షిప్ కూడా ఉందని, అది ప్రస్తుతం మండుతోందని కూపర్ తెలిపారు.
* అమెరికా దాడుల ఫలితంగా ఇరాన్ నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయని ఆయన వివరించారు.
* ఇరాన్ స్పేస్ కమాండ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా దెబ్బతీశామన్నారు.

కేవలం ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలను ధ్వంసం చేయడమే కాకుండా.. భవిష్యత్తులో వారు తిరిగి కోలుకోలేనంతగా క్షిపణి తయారీ పరిశ్రమను నేలమట్టం చేయడమే తమ తదుపరి లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది.
Masoud Pezeshkian
Iran
Israel
Middle East Conflict
US Military
Operation Epic Fury
Khorramshahr-4
Ballistic Missiles
Nuclear Program
Tehran

More Telugu News