ఏపీ వైపు చూస్తున్న విదేశీ సంస్థలు.. మంత్రి కొండపల్లి పర్యటనకు సానుకూల స్పందన
- విదేశీ పెట్టుబడుల కోసం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యూరప్ పర్యటన
- స్విట్జర్లాండ్, జర్మనీ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు
- ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ ‘ఒలివర్’తో మంత్రి కీలక చర్చలు
- భారత్లో యూనిట్ ఏర్పాటుకు స్విస్ కంపెనీ సుముఖత
- జర్మనీకి చెందిన ఫైర్స్ట్జెన్ సీఈఓతోనూ భేటీ
మంత్రి శ్రీనివాస్ గురువారం స్విట్జర్లాండ్లో పర్యటించారు. అత్యంత నాణ్యమైన వస్త్ర ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 'ఒలివర్' కంపెనీ ప్రతినిధులు, ఇతర టెక్స్టైల్ పరిశ్రమ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి వారికి వివరించారు. ఈ చర్చల అనంతరం, భారత్లో తమ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఒలివర్ కంపెనీ సుముఖత వ్యక్తం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
అనంతరం మంత్రి జర్మనీలోనూ పర్యటించారు. అక్కడ జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ 'ఫైర్స్ట్జెన్' వ్యవస్థాపకుడు, సీఈవో అయిన ఫిలిప్ ఆస్మస్తో కీలక చర్చలు జరిపారు. దీంతోపాటు, ఎక్స్పోర్ట్ అకాడమీ బాడెన్-వుర్టెన్బర్గ్ ప్రతినిధులతోనూ భేటీ అయ్యి రాష్ట్రంలో టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో సహకారంపై చర్చించినట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.