జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

  • ఏఐసీసీ నుండి ప్రకటన వెలువడిన ప్రకటన
  • ఉప ఎన్నిక కోసం టిక్కెట్ ఆశించిన పలువురు నాయకులు
  • నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఏఐసీసీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టిక్కెట్ కోసం అధికార పార్టీ నుంచి పలువురు ఆశావహులు పోటీ పడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ యువ నాయకుడు నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి పేర్లను అధిష్ఠానానికి పంపించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, ఆయన పోటీలో లేనని నిన్న స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, అధిష్ఠానం వారి పేర్లను పరిశీలించి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుండగా, 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది.


More Telugu News