వైట్‌హౌస్‌కు బంగారు మెరుగులు.. సొంత ఖర్చుతో అలంకరిస్తున్న ట్రంప్

  • వైట్‌హౌస్‌కు 24 క్యారెట్ల బంగారంతో అలంకరణ
  • ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్‌లకు బంగారు తాపడం
  • సోషల్ మీడియాలో వీడియోలు పంచుకున్న ట్రంప్
  • ప్రపంచ నేతలను ఆశ్చర్యపరచడమే లక్ష్యమని వ్యాఖ్య‌
  • ట్రంప్ ఆడంబరంపై వెల్లువెత్తిన విమర్శలు
  • ఖర్చు మొత్తం ట్రంప్ సొంత నిధులతోనేనని వైట్‌హౌస్ వెల్లడి
అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం (వైట్‌హౌస్‌) ఇకపై బంగారు వన్నె పులుముకోనుంది. అధ్యక్షుడి కార్యాలయమైన ఓవల్ ఆఫీస్‌తో పాటు క్యాబినెట్ రూమ్‌ను 24 క్యారెట్ల మేలిమి బంగారంతో అలంకరించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ అలంకరణ పనులకు సంబంధించిన వీడియోలను ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ పోస్ట్' వేదికగా పంచుకున్నారు.

ప్రస్తుతం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్‌లలో బంగారు తాపడం పనులు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. అలంకరణ కోసం సిద్ధం చేసిన బంగారు గోడల ఆకృతులు ఈ వీడియోలో కనిపించాయి. "ఈ కళ్లు చెదిరే అందాన్ని, విజయాన్ని చూసి ప్రపంచ దేశాల నేతలు నివ్వెరపోవడం ఖాయం. ఇంతటి అత్యుత్తమ అందాన్ని ఇప్పటివరకు ఓవల్ ఆఫీస్ మాత్రమే సొంతం చేసుకుంది," అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావ‌డంతో ట్రంప్ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఇంతటి ఆడంబరం అవసరమా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ విమర్శలపై వైట్‌హౌస్ స్పందించింది. బంగారు అలంకరణలకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని అధ్యక్షుడు ట్రంప్ తన సొంత నిధుల నుంచే భరిస్తున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.


More Telugu News