దుల్కర్ సల్మాన్ లగ్జరీ కారును సీజ్ చేసిన డీఆర్ఐ అధికారులు
- లగ్జరీ కార్ల పన్ను ఎగవేత స్కామ్
- 'నమ్ఖోర్' పేరుతో దేశవ్యాప్తంగా డీఆర్ఐ, కస్టమ్స్ అధికారుల దాడులు
- కేరళలో ఏకకాలంలో 30 ప్రాంతాల్లో సోదాలు
- దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు నటుల ఇళ్లలో తనిఖీలు
- భూటాన్ మీదుగా కార్లు దిగుమతి చేసి పన్ను ఎగవేస్తున్నట్టు గుర్తింపు
- నటుడు అమిత్ చాకలక్కల్కు చెందిన రెండు వాహనాలు కూడా స్వాధీనం
ఈ స్కామ్ విచారణలో కేరళ కీలకంగా మారడంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో దాదాపు 30 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా కొచ్చి సమీపంలోని మమ్ముట్టి పాత నివాసంలో పార్క్ చేసి ఉన్న ఎనిమిది లగ్జరీ కార్లను అధికారులు గంటల తరబడి తనిఖీ చేశారు. మరో నటుడు అమిత్ చాకలక్కల్కు సంబంధించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
భూటాన్ మార్గంలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు పన్నులు ఎగవేస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ వాహనాలను మొదట హిమాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ చేసి, ఆ తర్వాత నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు ఎనిమిది రకాల ఖరీదైన కార్లను ఈ పద్ధతిలో దేశంలోకి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఈ దాడుల నేపథ్యంలో నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. కేవలం ప్రముఖులపైనే కాకుండా, వాణిజ్యపరంగా కార్లను దిగుమతి చేసే వారిపైనా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. వాహనాలు సీజ్ చేసిన వారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి, యాజమాన్య హక్కులు, దిగుమతి పత్రాలను సమర్పించాలని కోరతామని తెలిపారు. ఈ స్కామ్ చాలా పెద్దదని, పలు దశల్లో విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.