సూపర్ ఫోర్‌లో పాకిస్థాన్.. యూఏఈపై చెమటోడ్చి విజయం

  • ఆసియా కప్ సూపర్ ఫోర్‌కు అర్హత సాధించిన పాకిస్థాన్
  • యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపు
  • పాక్‌ను ఆదుకున్న ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీ
  • బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన షాహీన్ షా అఫ్రిది
  • స్వల్ప స్కోరుకే కుప్పకూలిన యూఏఈ బ్యాటింగ్ లైనప్
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. అయితే, ఈ విజయం వారికి అంత సులువుగా దక్కలేదు. ఆతిథ్య యూఏఈ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెమటోడ్చి గెలవాల్సి వచ్చింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ పోరులో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఫకర్ జమాన్, ఆ తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో షాహీన్ షా అఫ్రిది పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూఏఈ బౌలర్ జునైద్ సిద్ధిఖీ నిప్పులు చెరిగే బంతులతో పాక్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో మూడు ఓవర్లలోనే పాకిస్థాన్ కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన ఫకర్ జమాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడుతో పాటు సంయమనం ప్రదర్శిస్తూ కేవలం 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (20)తో కలిసి మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అయితే, కెప్టెన్ ఔటైన తర్వాత పాక్ మళ్లీ తడబడింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. యూఏఈ బౌలర్లు జునైద్ సిద్ధిఖీ (4/18), సిమ్రన్‌జీత్ సింగ్ (3/26) ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియ‌న్‌కు క్యూ కట్టారు. అయితే, చివర్లో షాహీన్ షా అఫ్రిది మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కేవలం 14 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 29 పరుగులు చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. పాక్ బౌలర్ల క్రమశిక్షణాయుతమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. ఆరంభంలో కాస్త నిలకడగా ఆడినా, ఆ తర్వాత పేకమేడలా కుప్పకూలింది. చివరి ఏడు వికెట్లను కేవలం 20 పరుగుల తేడాతో కోల్పోయి దారుణంగా ఓటమి పాలైంది. షాహీన్ అఫ్రిది బంతితోనూ రాణించగా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు పాకిస్థాన్ కూడా సూపర్ ఫోర్‌కు అర్హత సాధించింది.


More Telugu News