Somireddy Chandramohan Reddy: దీనిపై సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు: సోమిరెడ్డి

Chandrababu Orders Vigilance Inquiry on Housing Scheme Says Somireddy
షార్ట్స్‌లో చూడండి
జగన్‌ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

గత ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు. మెటీరియల్ కొనుగోళ్ల కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించి, లబ్ధిదారుల పేరుతో దొంగ సంతకాలు సృష్టించి మెటీరియల్‌ను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. కేవలం స్టీల్ కొనుగోలులోనే దాదాపు రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని, మార్కెట్ ధరల కంటే అధిక ధరకు ఐరన్ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను వివరిస్తూ, రూ.630 విలువ చేసే ఒక స్టిక్కర్‌ను ఏకంగా రూ.1,300కు కొనుగోలు చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం ఇళ్లు పునాది దశలోనే ఆగిపోయాయని, నాణ్యతను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఒక ఇంటికి కేటాయించిన సిమెంట్‌ను మూడు ఇళ్లకు సర్దుబాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. 

ఇళ్ల స్థలాల కోసం చేసిన భూముల కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Somireddy Chandramohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
housing scheme scam
Jagan government
TDP
Vigilance investigation
Nellore
corruption
house construction

More Telugu News