మిథున్ రెడ్డితో ములాఖత్.. రాజమండ్రికి వెళ్లనున్న జగన్

మిథున్ రెడ్డితో ములాఖత్.. రాజమండ్రికి వెళ్లనున్న జగన్

  • లిక్కర్ స్కామ్ లో ఏ4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి
  • ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ
  • ఈ నెల 25న రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రి పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. ఈ నెల 25వ తేదీన మిథున్ రెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు.

లిక్కర్ కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, పార్టీ అధినేతగా ఆయనకు అండగా నిలిచేందుకు జగన్ ఈ పర్యటనను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ పర్యటన వివరాలను శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అధికారికంగా వెల్లడించారు.

మరోవైపు నిన్న బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, వంగా గీత రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. వారు మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన బొత్స... జగన్ పర్యటనపై ప్రకటన చేశారు.
Advertisement

More Telugu News