Preetam Prakash: ప్రియుడి కోసం భర్త హత్య.. ఏడాది తర్వాత ఫోన్ సిగ్నల్‌తో వీడిన మిస్టరీ!

Phone Signal Exposes Delhi Murder Plot
షార్ట్స్‌లో చూడండి
ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేయించి, ఏమీ తెలియనట్టు ఏడాదిగా నాటకమాడిన భార్య బండారం బట్టబయలైంది. భర్త హత్యకు సుపారీ ఇచ్చి, మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి, అనంతరం పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే, దాదాపు ఏడాది తర్వాత మృతుడి మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మృతుడి భార్య సోనియా (34), ఆమె ప్రియుడు రోహిత్ (28)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు నిన్న వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీలోని అలీపూర్‌కు చెందిన ప్రీతమ్ ప్రకాశ్ (42) ఒక హిస్టరీ షీటర్. అతడిపై మాదకద్రవ్యాలు, ఆయుధాల చట్టం కింద 10కి పైగా కేసులు ఉన్నాయి. అతడి భార్య సోనియాకు హర్యానాలోని సోనిపట్ కు చెందిన రోహిత్‌తో వివాహేతర సంబంధం ఉంది. భర్త నేర ప్రవృత్తి, వేధింపులు భరించలేక, ప్రియుడితో కలిసి అతడిని అడ్డు తొలగించుకోవాలని సోనియా పక్కా ప్రణాళిక వేసింది.

గతేడాది జులై 5న సోనియా తన సోదరి ఇంటికి వెళ్లగా, అక్కడికి వచ్చిన భర్త ప్రీతమ్‌తో గొడవపడింది. అదే రోజు, తన సోదరి బావ అయిన విజయ్‌కు రూ. 50,000 సుపారీ ఇచ్చి తన భర్తను చంపాలని కోరింది. ఆ రాత్రి ప్రీతమ్ అక్కడే నిద్రపోగా, విజయ్ అతడిని హత్య చేసి సమీపంలోని అగ్వాన్‌పూర్ డ్రైనేజీలో మృతదేహాన్ని పడేశాడు. అనంతరం మృతదేహం వీడియోను సోషల్ మీడియాలో సోనియాకు పంపి, తర్వాత డిలీట్ చేశాడు.

ఫోన్ సిగ్నల్‌తో చిక్కిన నిందితులు
భర్త హత్య జరిగిన పదిహేను రోజుల తర్వాత అంటే జులై 20న సోనియా అలీపూర్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వారాలు గడుస్తున్నా ప్రీతమ్‌కు సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలు గానీ, డిజిటల్ ఆధారాలు గానీ లభించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

దాదాపు ఏడాది తర్వాత ప్రీతమ్ మొబైల్ నంబర్ సోనిపట్‌లో యాక్టివ్‌గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సిగ్నల్ ఆధారంగా రోహిత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. సోనియాతో తనకున్న సంబంధం గురించి, ఇద్దరూ కలిసి ప్రీతమ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు రోహిత్ నేరాన్ని అంగీకరించాడు. సోనియానే విజయ్‌కు డబ్బు ఇచ్చి హత్య చేయించిందని వెల్లడించాడు. హత్య తర్వాత ప్రీతమ్ ఆటోను రూ. 4.5 లక్షలకు అమ్మి, అతని ఫోన్‌ను ప్రియుడు రోహిత్‌కు సోనియా ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.

హత్య జరిగిన సమయంలో హర్యానా పోలీసులు ఒక గుర్తుతెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ మృతదేహానికి సంబంధించిన డీఎన్‌ఏ నమూనాలతో సరిపోల్చి గుర్తింపును ధ్రువీకరించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన విజయ్ పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు రోహిత్‌పై కూడా గతంలో హత్య, ఆయుధాల చట్టం కింద నాలుగు కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
Go Back to Shorts
Preetam Prakash
Sonia
Rohit
Delhi Crime Branch
Murder
Extra marital affair
Crime news
Supari killing
Phone signal
Agwanpur drainage

More Telugu News