మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన రోజా, రాచమల్లు

  • ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
  • మండిపడుతున్న వైసీపీ నేతలు
  • అక్రమ కేసులు పెడుతున్నారన్న రోజా
  • రాజకీయ కక్ష సాధింపు అంటూ రాచమల్లు ఆగ్రహం
ఏపీ లిక్కర్ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి రోజా కూడా దీనిపై స్పందించారు. మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నానని తెలిపారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదని విమర్శించారు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుందని హెచ్చరించారు. 

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైసీపీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు చేస్తోందని ఆయన ఆరోపించారు.

రాచమల్లు రెడ్డి జారీ చేసిన పత్రికా ప్రకటనలో, "లేని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తూ, అంతులేని దారుణ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యలు ఇలాగే కొనసాగితే, వైసీపీ ఏ మాత్రం సహించదు. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నాం" అని హెచ్చరించారు.

నందిగం సురేశ్, విడదల రజని తదితరులు కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు. 


More Telugu News