ట్రిపుల్ సెంచరీ మిస్.. హ్యారీ బ్రూక్ స్లెడ్జింగ్‌కు బలైన గిల్.. ఇదిగో వైర‌ల్‌ వీడియో!

  • ఇంగ్లాడ్‌తో రెండో టెస్టులో కెప్టెన్ గిల్ చారిత్రక డబుల్ సెంచరీ
  • 269 పరుగులతో భారత టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు బద్దలు
  • ట్రిపుల్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో బ్రూక్‌తో మాటల యుద్ధం
  • స్లెడ్జింగ్ తర్వాత కొద్దిసేపటికే పెవిలియన్ చేరిన గిల్
టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాడ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్వితీయమైన ఇన్నింగ్స్‌తో చెలరేగి, 269 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఈ క్రమంలో భారత టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (254 నాటౌట్‌) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా తన రెండో మ్యాచ్‌లోనే ఈ అరుదైన ఘనతను అందుకోవడం విశేషం.

అయితే, ట్రిపుల్ సెంచరీ చేసేలా కనిపించిన సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీ విరామం తర్వాత షోయబ్ బషీర్ వేసిన ఓవర్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాడ్ ఆటగాడు హ్యారీ బ్రూక్.. గిల్‌ను మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. "290 పరుగుల వద్ద ఆడటం చాలా కష్టం" అని బ్రూక్ అనగా, "నీ కెరీర్‌లో ఎన్ని ట్రిపుల్ సెంచరీలు చేశావ్?" అని గిల్ ఘాటుగా బదులిచ్చినట్లు కామెంటేటర్ మైక్ అథర్టన్ వివరించారు. ఈ సంభాషణ జరిగిన కాసేపటికే గిల్ తన వికెట్ కోల్పోయాడు.

గిల్ అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించారు. ఆరో వికెట్‌కు జడేజాతో కలిసి 203 పరుగులు, ఏడో వికెట్‌కు సుందర్‌తో కలిసి 144 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌట్ అయింది.


More Telugu News