Vangalapudi Anitha: కారు కింద పడిన వ్యక్తిని లాగి పక్కన పడేశారు: జగన్ ట్వీట్ కు హోంమంత్రి అనిత కౌంటర్

Vangalapudi Anitha Counter to Jagan on Singayya Death
షార్ట్స్‌లో చూడండి
పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని ఆమె మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ, జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, రాజకీయ నాయకుల మాటలను ప్రజలు నిశితంగా గమనిస్తారని అన్నారు.

"సొంత పార్టీ కార్యకర్త వాహనం కింద పడితే పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయం. గాయపడిన వ్యక్తిని కనికరం లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. ఆ వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే బహుశా ప్రాణాలు నిలిచేవేమో. జగన్‌కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? మనుషుల ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేదా? ఇద్దరు వ్యక్తులు మరణించినప్పటికీ జగన్‌ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు" అని మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగిన తప్పును సమర్థించుకోవడం మరింత దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. "జగన్ రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్థుడు. గతంలో సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా అక్కడ రచ్చ రచ్చ చేశారు. పొదిలి వెళ్లినప్పుడు మహిళలు, పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. రెంటపాళ్లకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు ఎంత చెప్పినా వినకుండా వ్యవహరించారు. ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి పరామర్శకు ఎలా వెళ్లాలో తెలియదా? కేవలం బలప్రదర్శన చేయడానికే జగన్ బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. 'రప్పా రప్పా' అంటే తప్పేంటని అడగడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోంది" అని అనిత తీవ్రంగా విమర్శించారు.

జగన్ భద్రతపై స్పష్టత:
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేవని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆయన భద్రతకు సంబంధించి  చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. జగన్‌కు నిబంధనల ప్రకారం కేటాయించాల్సిన పూర్తి స్థాయి భద్రతను పోలీస్ శాఖ కల్పిస్తోందని తెలిపారు. ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా రోజూ ఆయన వద్దకు వెళ్తుందని, అయితే, జగన్ ఆ వాహనాన్ని ఉపయోగించకుండా తన సొంత వాహనంలోనే ప్రయాణిస్తున్నారని మంత్రి వివరించారు. "ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కినా, ఎక్కకపోయినా, జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తికి నిబంధనల ప్రకారం ఆ వాహనాన్ని అందుబాటులో ఉంచడం మా బాధ్యత," అని అనిత పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ఎవరి భద్రత విషయంలోనూ పక్షపాతంగా వ్యవహరించదని, పూర్తి పారదర్శకంగా ఉంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. అయినప్పటికీ, కొందరు కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇటీవల రెంటచింతల ఘటనను ప్రస్తావిస్తూ, "గంగమ్మ జాతరలో గొర్రెపోతులను నరికినట్లు నరుకుతాం" అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి, సమర్థించిన వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు.

వైసీపీ నేతల తీరుపై మండిపాటు:
కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక చేత్తో గొడ్డలి, మరో చేత్తో పార్టీ జెండా పట్టుకుని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఇలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. "ఒకరేమో నరికేస్తాం అంటారు, ఇంకొకరేమో కోసేస్తాం అంటారు. ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం తప్పు కాదా అని ప్రశ్నిస్తే, సినిమా డైలాగ్ కదా అంటున్నారు. సినిమాల్లో చంపడం చూపిస్తే, దాన్ని బయట కూడా ఆచరించవచ్చా?" అని ఆమె నిలదీశారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే, వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో ఇలాంటి హింసను ప్రేరేపించే వ్యక్తులకు స్థానం ఉండకూడదని అనిత అన్నారు. "2029లో మళ్లీ మేమే వస్తాం, ఇలాంటి హింసనే కొనసాగిస్తాం అన్నట్లుగా పరోక్షంగా సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే ధోరణి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి," అని ఆమె వ్యాఖ్యానించారు.

ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ఎవరైనా అది చూస్తే వారికి సహాయం చేస్తారని, గాయపడిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలిస్తారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో ఇటీవల ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి సహాయం అందించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు.
Go Back to Shorts
Vangalapudi Anitha
Singayya death
Jagan Mohan Reddy
Palanadu district
YS Jagan
Andhra Pradesh politics
Road accident
Home Minister AP
YSRCP
TDP

More Telugu News