ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి ఎలా చేసిందంటే..?
- 37 గంటలు ఏకధాటి ప్రయాణించిన 2 బాంబర్లు
- గాల్లోనే పలుమార్లు ఇంధనం నింపుకుని పయనం
- ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ లక్ష్యంగా దాడులు
- ఫోర్డో అణుకేంద్రం పూర్తిగా నాశనం చేశామన్న ట్రంప్
ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లపై ఈ దాడులు జరిగినట్లు ట్రంప్ తెలిపారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన భూగర్భ అణు కేంద్రంగా పేరున్న ఫోర్డో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్ అద్భుతమైన విజయమని కొనియాడారు. ఈ దాడుల్లో బంకర్ బస్టర్ బాంబులు, టోమాహాక్ క్షిపణులను ఉపయోగించినట్లు తెలిసింది. ఫోర్డోపై ఆరు బంకర్ బస్టర్ బాంబులు, ఇతర అణుకేంద్రాలపై సుమారు 30 టోమాహాక్ క్షిపణులు ప్రయోగించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఘర్షణల నేపథ్యంలో అమెరికా ఈ ప్రత్యక్ష సైనిక చర్యకు దిగింది. శనివారం నాడే అమెరికా బి-2 బాంబర్లను పసిఫిక్ ద్వీపమైన గ్వామ్కు తరలించింది. ఈ బాంబర్లు ఫోర్డో వంటి లోతైన భూగర్భ లక్ష్యాలను ఛేదించగల జీబీయూ-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను మోసుకెళ్లగలవు. "శత్రువుల వైమానిక దాడుల" వల్ల ఫోర్డోలోని కొంత భాగం దెబ్బతిన్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ ఒక అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.